ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలహీనవర్గాల ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించాడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బోగస్ రేషన్ కార్డుల విషయంలో సైతం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, త్వరలోనే బోగస్ రేషన్ కార్డులను పూర్తిగా ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
గత ప్రభుత్వాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కారు చౌకగా భూములను వివిధ సంస్థలకు అప్పగించిన విషయంలో సైతం ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, దీనిపై సీఐడీ విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని వివిధ రాష్ర్టాల ఎంపీలు తమతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిలో పోటీ పడుతానని అన్న ఏపీ ముఖ్యమం త్రి చంద్రబాబు తోక ముడిచి కనిపించకుండా పోయారని ఎద్దేవాచేశారు.