Home / తెలుగు / భూపంపిణీపై పలు రాష్ర్టాల ఆసక్తి!

భూపంపిణీపై పలు రాష్ర్టాల ఆసక్తి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబం పథకం పలు రాష్ర్టాలను ఆకర్షిస్తున్నది. ఈ పథకం తీరుతెన్నులపై పలు రాష్ర్టాలు ఆసక్తిగా వాకబు చేస్తున్నాయి. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వ్యవసాయ సాగుయోగ్యమైన భూమిని ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.

pattaluప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపే ఈ హామీని అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేసి శుక్రవారం (ఆగస్టు 15న) ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. భూమి ఇవ్వడం మాత్రమే కాకుండా నీటి వనరుల కల్పన, ఏడాదిపాటు ఖర్చులన్నీ భరించడంవంటి అంశాలు వివిధ రాష్ర్టాల రాజకీయ వర్గాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాన్ని ఎవరికి వర్తింపచేయాలి? ఎలా వర్తింపచేయాలి? సాధ్యాసాధ్యాలు ఏ మేరకున్నాయి? అన్న విషయాలన్నీ ముందే సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఆ క్రమంలో ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ జీవో నెంబర్ 1, మార్గదర్శకాల జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో ఉన్న అంశాలను గతంలో ఏ రాష్ట్రంలోనూ వర్తింపచేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరుగుతున్న భూ పంపిణీపై అనేక రాష్ర్టాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇప్పటికే తమిళనాడు, కర్నాటకకు చెందిన రాష్ర్టాల ప్రిన్సిపల్ సెక్రెటరీలు తెలంగాణ రాష్ర్టానికిచెందిన సంబంధిత అధికారులకు ఫోన్‌లు చేసి జీవో కాపీలు పంపించాలని కోరారు. అదే సమయంలో ఆ జీవోల్లో ఉన్న కొన్ని అంశాలపై మన రాష్ర్టానికి చెందిన అధికారులతో ఫోన్‌లోనే చర్చలు కూడా జరిపారు.

లబ్ధిదారుల ఎంపికకు పాటించిన పద్ధతులు, భూమి సేకరణ, కొనుగోలు , అలాగే కొన్ని కష్టసాధ్యమైన అంశాలపై ఈ రెండు రాష్ర్టాల అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ పథకానికి అయ్యే వ్యయభారంపై కూడా వారు ఆసక్తితో తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఇక్కడి ప్రజల పోరాటాలు, భూసమస్య తదితర అంశాలు విశదీకరిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాన్ని ప్రారంభించదలిస్తే ఆవేవీ అసాధ్యం కాదని, భూమి కొనుగోలుకు ఎంత ఖర్చుపెట్టేందుకైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు వారికి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన భూ పంపిణీ పథకంపై పార్లమెంట్‌లో ఇతర రాష్ర్టాలకు చెందిన పలువురు ఎంపీలు తెలంగాణ ఎంపీలను ఆరా తీశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలు ఇవ్వాలని అడిగారు. ఎంపీలు రాష్ట్ర అధికారులను సంప్రదించి జీవో కాపీలతోపాటు వివరాలను వారికి అందజేశారు. 

గతంలో జరిగిందంతా హడావుడే..

గతంలో భూ పంపిణీ పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో హడావిడి జరిగినపుడు ఎవరూ పట్టించుకోలేదని కానీ ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సమాచారం పక్క రాష్ర్టాల వారికి తెలిసి సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తున్నాయని తెలిపారు. గత 50సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భూ పంపిణీ కేవలం 40వేల ఎకరాలేనని, అందుకోసం చేసిన వ్యయం కేవలం రూ.98కోట్లు మాత్రమేనని వారు చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.188కోట్లతో భూమి కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఏదేమైనా భూమిలేని దళితులందరికీ భూమి దక్కేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,281 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>