ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడిందని, స్థానికతను సరిగ్గా నిర్ధారించలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమలనాథన్ కమిటీతో సమావేశాల సందర్భంగా తాము వ్యక్తంచేసిన అభిప్రాయాలను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మార్గదర్శకాలు రూపొందించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
వీటి ద్వారా కేంద్ర పాలకులు ఉద్యోగుల విభజనను జటిలం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సీమాంధ్ర బాబుల ప్రభావం, కేంద్ర పాలకుల మితిమీరిన జోక్యం మార్గదర్శకాల్లో ఉందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసేవిధంగా కుట్రలకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ఆగస్టు చివరినాటికి ఉద్యోగులందరి స్థానికతపై విచారణ జరుపాలని, పాఠశాలలు ఇచ్చిన బోనఫైడ్ సర్టిఫికెట్ ప్రకారం స్థానికతను నిర్ధారించడం శాస్త్రీయమైన విధానం కానేకాదని వారు స్పష్టం చేస్తున్నారు. బోనఫైడ్ సర్టిఫికెట్ ఒక్కటే స్థానికత నిర్ధారణకు ప్రామాణికం కాదని తేల్చిచెప్తున్నారు.
ఈ మేరకు మార్గదర్శకాలపై తమ అభ్యంతరాలను వివరిస్తూ కేంద్రానికి అందించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు మహావిజ్ఞపనను సిద్ధంచేస్తున్నారు. ప్రతీ తెలంగాణ ఉద్యోగిని సొంత రాష్ర్టానికి కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో దీనిని రూపొందిస్తున్నారు. ఈ అంశంపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మను ఉద్యోగ నేతలు సంప్రదించనున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చే సూచనల ప్రకారం ఈ విజ్ఞాపనను రూపొందించనున్నారు. అక్టోబర్ 31నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేయాలని, మార్గదర్శకాలను మరింత స్పష్టంగా రూపొందించి విభజనను వేగవంతం చేయాలని ఈ విజ్ఞాపనలో కేంద్రాన్ని కోరనున్నారు. హైదరాబాద్ పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వనవసరం లేదని, రెండేండ్లలో రిటైర్ కానున్న ఉద్యోగులను కూడా ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ర్టానికి కేటాయించాలని పేర్కొన్నారు.
విభజన ప్రక్రియను ఏపీ ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తూ ఇచ్చిన మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, అంతే ప్రాధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియపైన రెండు రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులకు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు స్వేచ్ఛ నివ్వాలని, ఈ విషయంలో 18(ఈ) నిబంధనను రద్దు చేయాలని టీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. 18(ఈ) నిబంధన రాష్ర్టాలకు ఉండే రాజ్యాంగబద్ధమైన హక్కులను హరిస్తున్నదని మండిపడుతున్నారు. వ్యక్తిగతంగా కమలనాథన్ అంటే మాకు అపార గౌరవముంది. తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలను స్వీకరించడంలో ఆయన చూపిన శ్రద్ధ ప్రశంసనీయం.
అయితే మాతో వివిధ సందర్భాలలో జరిగిన సమావేశాలలో కమలనాథన్ చెప్పిన అభిప్రాయాల ప్రకారం మార్గదర్శకాలు లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ మార్గదర్శకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభావం ఉన్నదని భావిస్తున్నాం. అందుకే కచ్చితంగా ఉద్యోగులందరి స్థానికతను వెరిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మార్గదర్శకాలలో పొందుపరిచిన అంశాలను మేం వ్యతిరేకిస్తున్నాం అని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ స్పష్టంచేశారు.