ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యను, క్యాడర్స్ట్రెంత్ను నిర్ధారించిన తర్వాతనే ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వెలువరిస్తామని ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్ పేర్కొన్నారు. క్యాడర్స్ట్రెంత్ను 13 ః10 నిష్పత్తిలోనే విభజిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజులలో ఉమ్మడి అంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం విభజన కమిటీ సమావేశం తర్వాత ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మార్చి 2015 నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. అనేక విషయాలలో స్పష్టత లేనందున ఆలస్యం సహజమేనని అన్నారు. పొరపాట్లు జరుగకుండా ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకొని ఎవరికీ నష్టం జరుగకూడని పద్ధతిలో, సామరస్యంగా, సానుకూలంగా విభజన జరగాలని కమిటీ భావిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో క్షేత్రస్థాయినుంచి సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని కోరుతున్నదని, ఈ కోరిక న్యాయమేనదని కమలనాథన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల క్యాడర్స్ట్రెంత్ను నిర్ధారించిన తర్వాతనే తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగులను తెలంగాణకు బట్వాడా చేయగలుగుతామని పేర్కొన్నారు. చాలా విషయాలలో ఏకాభిప్రాయం కుదరలేదని అంగీకరిస్తూనే అతిత్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఉద్యోగుల స్థానికతపై తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులు వెరిఫికేషన్ కోరుతున్నారని, వారి కోరికను తప్పక మన్నిస్తామని చెప్పారు. అభ్యంతరాలన్నింటినీ కమిటీ అధ్యయనం చేసిందని తెలిపారు. వాటిపై కమిటీ రిమార్కులతో కమిటీ సభ్యులందరికీ నోట్ ఇచ్చామని వెల్లడించారు. వీటిని అధ్యయనం చేసిన తర్వాత పదిహేను రోజులలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ముసాయిదా మార్గదర్శకాలలోని నిబంధన-16, నిబంధన-18, నిబంధన -19, నిబంధన-13లపైన అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. రెండు ప్రభుత్వాలు సూపర్న్యూమరీ పోస్టుల ఏర్పాటు చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు.
-టీఎన్జీవో అధ్యక్షులు జీ దేవీప్రసాద్ విమర్శ
సీమాంధ్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరివల్లనే ఉద్యోగుల విభజన ప్రక్రియ ఆలస్యమవుతున్నదని టీఎన్జీవో అధ్యక్షులు జీ దేవీప్రసాద్ విమర్శించారు. తెలంగాణకు చెందిన నాలుగోతరగతి ఉద్యోగులను కూడా తెలంగాణకు బదిలీ చేయకుండా ఆంధ్రసర్కార్ అడ్డం పడుతున్నదని బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆరోపించారు. విభజనను వీలైనంత ఆలస్యం చేసేందుకు సీమాంధ్ర సర్కార్ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. తెలంగాణకు బట్వాడా చేసే ఉద్యోగులందరీ స్థానికతను వెరిఫై చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల సంఖ్య, క్యాడర్స్ట్రెంత్, రెండు రాష్ర్టాలకు బట్వాడా చేసిన ఉద్యోగుల జాబితా, ఏ ప్రాతిపదికన బట్వాడా చేశారనే అంశాలపై కమలనాథన్ కమిటీని ప్రశ్నించినప్పటికీ ఇంతవరకు సమాధానాలను చెప్పలేదని ఆయన విమర్శించారు.
ఫైనల్ మార్గదర్శకాలకు ముందే శాఖాధిపతుల కార్యాలయాల సంఖ్యను, క్యాడర్స్ట్రెంత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ను మంజూరు చేస్తూ జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. 19న సర్వేలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఆయనతో పాటు టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామనేని శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి ప్రతాప్, టీఎన్జీవో సమన్వయ సంఘం కార్యదర్శి హరిబాబు, టీఎన్జీవో సెక్రటేరియట్ విభాగం అధ్యక్షులు శ్రావణ్కుమార్రెడ్డి తదితరులు న్నారు.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో