ఎర్రగా విరగబూసి అడవికికే వన్నె తెచ్చే మోదుగపూవు, పరిమళాలు వెదజల్లే ఇప్ప చెట్టు, భారీ ఆకారంలో ఠీవిగా కనిపించే అడవిదున్న, అందమైన పాలపిట్ట.. ఇవీ తెలంగాణ రాష్ట్ర చిహ్నలుగా తెరముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర జంతువు, పక్షి, చెట్టు, పూవుల చిహ్నాలను ఎంపికచేయడంపై అధికారులు, నిపుణులు కసరత్తు పూర్తిచేశారు.
ప్రభుత్వ ఆమోదానికి నివేదిక సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటక, ఒడిశాలకు రాష్ట్రపక్షిగా ఉన్న పాలపిట్ట (ఇండియన్ రోలర్)కు బదులు ఇండియన్ బర్డ్ను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ పాలపిట్టకు తెలంగాణలో ప్రత్యేకస్థానం ఉన్నందున దానినే రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయాలని నిపుణులు, అటవీశాఖ అధికారులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తున్నది. పాలపిట్ట విజయదశమి రోజు కనపడితే శుభమని తెలంగాణ ప్రజలు భావిస్తారు.
ఈ కారణంగానే పాలపిట్ట ఇప్పటికీ మూడు రాష్ర్టాల్లో ఉన్నా తెలంగాణకు కూడా దానినే ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. వరంగల్ నుంచి మొదలుకుని ఆదిలాబాద్, ఖమ్మం వరకు అడవులకు వన్నె తెస్తున్న అడవిదున్నను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయడంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఇక తెలంగాణలో జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే మోదుగపూవును రాష్ట్ర పూవుగా ఎంపిక చేయనున్నారు. మోదుగ పూవులను హోళీకి రంగుల తయారీలో వాడుతారు. జీవరసాయన రంగుల తయారీలో ఈ పూవులది ప్రత్యేకస్థానం. మోదుగ ఆకులను విస్తర్లుగా కూడా తయారుచేస్తారు. మోదుగ చెట్టును గిరిజనులు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ చెట్టుపై రోసీ ఫాస్టర్ అనే జాతికి చెందిన అరుదైన పక్షలు ఆవాసముంటాయి. ఇక ఇప్ప చెట్టు(మహువా) రాష్ట్ర చెట్టుగా ఎంపిక కావడం దాదాపు ఖరారైంది. మధుకా ఇండికా శాస్త్రీయ నామం కలిగిన ఈ చెట్టు పండ్లు, పూవులు ఔషధగుణాలను కలిగి ఉంటాయి. ఇప్పచెట్టు తెలంగాణ గిరిజనులు, ఆదివాసీల సంస్కృతిలో భాగమైంది.
ఈ పువ్వుల నుంచి నూనెను తీస్తారు. ఈ నూనెను సబ్బుల తయారీలో వాడుతారు. ఈ చెట్టు పూలతో సారాయిని కూడా తయారు చేస్తారు. గొండ్లు, కోయలు ఈ చెట్టుకు పూజలు చేస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేశారు. నేడో రేపో దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ప్రభుత్వం యథావిధిగా ఆమోద ముద్ర వేస్తుందా లేక మార్పులు సూచిస్తుందా అనేది వేచి చూడాలి.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో