ఉద్యోగుల విభజన ప్రక్రియకు సీమాంధ్ర చంద్ర గ్రహణం పట్టిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు బట్వాడా చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతున్నదని వారు ఆరోపించారు. చంద్రబాబు, కేంద్రం మిలాఖత్ కావడం వల్లనే విభజన ప్రక్రియ జాప్యం జరుగుతున్నదని వారన్నారు. కేంద్రం కూడా ఉద్దేశపూర్వకంగా జనవరి 2015 వరకు విభజన ప్రక్రియ సాగదీయాలని చూస్తున్నదన్నారు. అక్టోబర్ 31 నాటికి విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న తమ డిమాండ్పైన కమలనాథన్ కమిటీ, ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదన్నారు.
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నదని ఫలితంగానే ఉద్యోగుల విభజనకు ఏపీజీఏడీ కేంద్ర కార్యాలయమయ్యిందని టీ ఉద్యోగసంఘాల నాయకులన్నారు. జూలై 25న కమలనాథన్ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలలో చంద్రబాబు పెత్తనం కనిపిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలలోని ఉద్యోగులు, వివిధ ప్రాజెక్ట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆయుష్, ప్లానింగ్ తదితర విభాగాల ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే సీమాంధ్ర పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కమలనాథన్, పీకే మహంతి, పీవీ రమేశ్ చంద్రబాబు సలహాల ప్రకారమే నడుచుకున్నారని తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు ఏ పద్మాచారి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసుకుంటామని ప్రకటించినా కమలనాథన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని, ఏపీ ప్రభుత్వం ఆ విషయంలో నోరు మెదపడం లేదని అన్నారు.
విభజన ప్రక్రియలో కేంద్రం పెత్తనం మితిమీరినా ఏపీఎన్జీవో సంఘాలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఉద్యోగులందరికీ 60 సంవత్సరాల వయోపరిమితి వర్తిస్తుందని ప్రకటనలు చేసినా జూలై 31న రాజమండ్రి జైళ్ళశాఖలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిటైర్ చేశారని పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ఉద్యోగులు వేతనాలు కూడా లేక కొట్టుమిట్టాడుతున్నారని, అయినా ఏపీఎన్జీవో నాయకులు, సీమాంధ్ర ప్రభుత్వం వారికి గాలికి వదిలేశారని ఆరోపించారు.