ఉద్యోగుల విభజన నేపథ్యంలో తమకు తీరని అన్యాయం జరుగుతున్నదని మొరపెట్టుకున్న తెలంగాణ ఉద్యోగులపై కమలనాథన్ విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు చేయలేని పక్షంలో రాజీనామాలు చేసి వెళ్లాపోవాలని అన్నారు. ఉద్యోగుల విభజనకు ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీని మంగళవారం తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు ఏ పద్మాచారి, చైర్మన్ కే రాములు సారథ్యంలో ఉద్యోగులు కలిశారు.
తెలంగాణ ఉద్యోగులకు తీరని అన్యాయాలు జరుగుతున్నాయని, తాము ఉద్యోగాలు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వారు కమలనాథన్కు తమ కష్టాలను వివరించారు. ఈ సందర్భంలోనే ఉద్యోగ నాయకులకు, కమలనాథన్కు వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఉద్యోగాలు చేయలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండని కమలనాథన్ మండిపడ్డారు.
విభజన సందర్భంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయని, వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కమలనాథన్ ఉద్యోగ నాయకులకు చెప్పారు. విభజనలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ జీఏడీ అధికారిని మెంబర్ సెక్రటరీని చేయడం అన్యాయమని, ఇలాంటి నిర్ణయాలు ఆరుదశాబ్దాల తెలంగాణ ఉద్యోగుల పోరాటాలను అవమానించడమేనని పద్మాచారి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులు బాధలను, కష్టాలను, ఇబ్బందులను చెప్పడానికి వస్తే రాజీనామాలు చేయాలంటూ కసురుకోవడం ఎంతవరకు న్యాయసమ్మతమని టీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ కే రాములు మాట్లాడుతూ 14(2) నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉద్యోగులను, అధికారులను తెలంగాణకు డిప్యూటేషన్ పద్ధతిలో బట్వాడా చేసేందుకు అవకాశం కల్పించారని, భారతదేశంలో ఏ రాష్ట్ర విభజన సందర్భంలోనూ ఉపయోగించని నిబంధనలను ఏపీ విభజనలో ఉపయోగించారని ఆరోపించారు.
తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థలలోని తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణకు కేటాయించాలని టీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విభజన ఆలస్యం జరిగితే వేల మంది ఉద్యోగులు ప్రభుత్వరంగ సంస్థలలోకి డిప్యూటేషన్ పద్ధతిలో అక్రమంగా చొరబడటానికి అవకాశాలుంటాయని వాదించారు. ఇప్పటికే 610 జీవో, నియామకాలు, పదోన్నతులు, రాష్ట్రపతి ఉత్తర్వులు, 371-డీ ఉల్లంఘనలతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని వారు కమలనాథన్కు వివరించారు. ఈ కారణంగానే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిందని టీ ఉద్యోగ సంఘాల నాయకులు వివరించారు.
ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం కోసం ఇచ్చిన నమూనాలో ప్రత్యేకంగా ఆప్షన్ విధానాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్న సందర్భంలో ఆప్షన్ల అవసరమేంటని ప్రశ్నించారు. నమూనాలోని ఆప్షన్ అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 18(హెచ్)లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చారని, అయితే ముందుగా తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు నాగరాజు, తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సుభద్ర తదితరులు కమలనాథన్ను కలిసి విజ్ఞాపనలను అందచేశారు.