నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగుల స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. పదిరోజుల్లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటు కాబోతున్నది. ఇప్పటికే ఫైల్ను సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ దాన్ని త్వరలోనే గవర్నర్కు పంపనుంది. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో కూడిన ఫైల్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి చేరింది.
దీన్ని ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపనున్నామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బీ వెంకటేశ్వరరావు తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పదిరోజుల్లోనే టీపీఎస్సీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే టీపీఎస్సీ ఏర్పాటైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో జారీ అవుతుంది. ఆ తర్వాత చైర్మన్తో పాటు కనీసం ఇద్దరు, గరిష్ఠంగా ఆరుగురు సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. టీపీఎస్సీ కార్యదర్శితో పాటు ఇతర ఆఫీసు సిబ్బంది నియామకం వంటిపనులు శరవేగంగా పూర్తిచేసి, వెనువెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
టీపీఎస్సీ ద్వారా దాదాపు 20వేలపైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అత్యంత ప్రాధాన్యం కలిగిన గ్రూప్-1 పోస్టులు 200 వరకు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. గ్రూప్-2 ద్వారా 1500, గ్రూప్-4 ద్వారా 3000 పోస్టులు భర్తీ చేయనున్నారని అధికారులు చెప్తున్నారు. అలాగే 1000 గెజిటెడ్ పోస్టులు, 4500 జేఎల్, 2000 డీఎల్, మూడువేల పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఉద్యోగాల విభజనకు ఏర్పాటైన కమలనాథన్ కమిటీ నివేదిక తర్వాత ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
టీపీఎస్సీ ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, గెజిటెడ్, నాన్ గెజిటెడ్వంటి పరీక్షల్లో సంస్కరణలు తేవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 వంటి కీలక ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ ల పేరిట తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఇలాంటివాటికి చెక్పెట్టేందుకు పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. వయోపరిమితిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం కారణంగా ఉద్యోగాలపై దృష్టిపెట్టలేకపోయామని, వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు లేదా తగ్గించే అంశంపైనా త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏర్పాటైన ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి రోస్టర్ పాయింట్ల విధానంపై సర్కారు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటించనున్నారు.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో
తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉస్మానియా విద్యార్థులకు ఈ విషయం సరిగ్గా తెలియజేసి విద్యార్థులలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పునరుద్దీకరించవచ్చు కదా!