- మరుగుదొడ్డినీ వదలని అల్పత్వం
- సీఎం సందర్శకులకు కేటాయించిన ఎస్ఐబీ భవనంపై బయటపడ్డ కడుపుమంట
- సహించేది లేదంటున్న తెలంగాణవాదులు
- ప్రభుత్వ భవనాలకు రక్షకుడు గవర్నరే..
- ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్
-సీమాంధ్ర అధికారుల చిల్లరవేషాలు!
-ఎస్ఐబీ భవనం ఖాళీచేస్తూ కోటికిపైగా విలువైన ఫర్నీచర్ లూటీ
హైదరాబాద్, జూలై 29 (టీ మీడియా): సీమాంధ్రుల సోదర ప్రేమ ఏపాటిదో మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర అధికారుల కడుపు మంట బజారుకెక్కింది. తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్రావుకు గ్రీవెన్స్ కార్యాలయంగా కేటాయించిన ఎస్ఐబీ భవనం వేదికగా ఆంధ్రపోలీసులు జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడ్డారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అరాచకశక్తుల్లా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకువచ్చే ప్రజలు, సందర్శకులకోసం సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) కార్యాలయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే.
నాలుగు రోజుల క్రిత మే ఈ భవనాన్ని గ్రీవెన్స్ కార్యాలయంగా ఏర్పాటుచేసుకునేందుకు కేటాయింపు జరిగింది. అప్పటివరకు ఆ భవనంలో ఆంధ్ర గ్రేహౌం డ్స్ కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయాన్ని మరోచోటకి మార్చుకోవాలని గవర్నర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికోసం భవనాన్ని కేటాయించడాన్ని జీర్ణించుకోలేని ఈ విభాగం ఉన్నతాధికారులు భవనంలో విధ్వంసం సృష్టించా రు. ఎప్పుడో నిజాం నవాబు కట్టించిన ఈ భవనమేదో తమ అత్తగారి సొత్తు అయినట్టు భవనంలోని అనేక వస్తువులను, సామాగ్రిని కొల్లగొట్టి, రాత్రికి రాత్రే తరలించుకుపోయారు. ఇక్కడ తరలించుకుపోయి న ఫర్నీచర్ విలువ కోటిరూపాయల పైమాటేనని అంచనా. ఈ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉన్న టేబుల్ ఒక్కటే 15 లక్షల రూపా యల పైచిలుకు ఉంటుందని అంటున్నారు.
ఈ భవనంలోని కిటికీలు, గ్రిల్స్, వాటికున్న అద్దాలనుకూడా పూర్తిగా పెకిలించి వెంట తీసుకెళ్లారు. భవనానికి ముందుభాగంలో ఉన్న ఎనిమిది కిటీకీలు, వాటికున్న అద్దాలను కూడా బలవంతంగా ఊడబెరికారు. భవనంలోపల కాన్ఫరెన్స్ హాల్లో స్విచ్ బోర్డులను కూడా వదల్లేదు. ఏసీ కనెక్షన్లను ఇష్టం వచ్చినట్టు కట్ చేసి, మళ్లీ పనికిరాకుండా చేశారు. ఫ్యాన్లు, లైట్లు అన్ని తీసిపారేశారు. నీచ సంస్కృతిని బయటపెట్టుకున్న ఆంధ్ర అధికారులు బాత్రూమ్ల్లోని వాష్బేషిన్, దానికున్న ట్యాప్ కనెక్షన్, ట్యాప్లు ఊడబీకించారు. అన్నింటినీమించి చివరకు లావెట్రీ వెస్ట్రన్ టైప్ మరుగుదొడ్డి (కమోడ్)ను, సాధారణ మరుగుదొడ్డి బేసిన్ను సైతం ఊడబెరికి వెంట భద్రంగా పట్టుకెళ్లారు. బాత్రూమ్లో ఉన్న కరెంట్ వైర్లను కత్తిరించారు. వీలున్నంతదాకా భవనంలో పాల్సీలింగ్ను పూర్తిగా నాశనం చేశారు. ఇష్టం ఉన్నట్టు ఫ్యాన్లు, బల్బులు తీయడంతో ఫాల్సీలింగ్ ఖరాబయిపోయింది. భవనానికి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్ ఫ్యూజ్తోపాటు మీటర్నుసైతం ఎత్తుకెళ్లారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడం మీద వారికి ఉన్న అక్కసు కడుపుమంట నిర్లజ్జగా చాటుకున్నారు.
దోపిడిదారులు, పెట్టుబడిదారులు, స్కామ్లకు స్కీములు చెప్పే ఆంధ్రా ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంవల్లే ఇలాంటి పైత్యపు పనులకు సీమాంధ్ర పోలీస్ అధికారులు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజులక్రితం సీఎం కేసీఆర్తో పలువురు అధికారులు ఈ భవనాన్ని పరిశీలించారు. సమస్యలతో వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఈ భవనం ఉందని సీఎం కేసీఆర్ భావించారు.
అంతలోపే ఇలాంటి దుశ్చర్చకు పాల్పడటం సీమాంధ్రుల కుట్రబుద్ధిని తేటతెల్లం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే రోజు రాత్రి సీమాంధ్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐబీ భవనంలోని మొత్తం సామాగ్రిని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ భవనం ప్రారంభ శిలఫలకాన్ని సైతం సీమాంధ్ర అధికారులు ధ్వంసం చేయించారంటే ఈ పోలీసు విభాగం క్రమశిక్షణ ఏమిటో అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలపై ఎంతటి విషాన్ని, అక్కసును సీమాంధ్ర ప్రభుత్వపెద్దలు, అధికారులు మూటగట్టుకున్నరో ఈ ఘటన కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగే వరకు ఇక్కడ ఎస్ఐబీ కార్యకలాపాలు సాగించేది. విభజనలో భాగంగా అది ఈ భవనం వెనకాల ఉన్న కొత్త భవంతిలోకి మారిపోయింది. ఆ సమయంలో ఖాళీ చేసిన ఆ విభాగం అధికారులు సిబ్బంది ఇక్కడి ఫర్నీచర్ కాదు కదా కనీసం ఒక బల్బును కూడా ముట్టుకోలేదు. విభజన తర్వాత ఈ భవనాన్ని సీమాంధ్ర గ్రేహౌండ్స్కు కేటాయించారు. ఈ విభాగం వచ్చి చేరినా అప్పటికే అన్ని సౌకర్యాలు ఉండడంతో దీని అవసరాలకోసం పైసా ఖర్చు పెట్టలేదు.
ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరాల కోసం దీన్ని ఖాళీ చేయాల్సి వస్తే ఇక్కడి సౌకర్యాలేవో తమ సొంత డబ్బులతో ఏర్పాటుచేసినట్టు తీసుకెళ్లడం వారి కడుపు మంటను బయటపెట్టినట్టయింది. పోనీ ఇదేదో తరతరాలుగా ఇక్కడున్నారా అంటే వాళ్లు వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. విభజనలో భాగంగా అనేక కార్యాలయాలు రెండుగా చీలిపోయాయి. ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ పోలీస్ శాఖలో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం సిగ్గుచేటని రిటైర్డ్ ఐపీఎస్లు ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం గ్రీవెన్స్ కార్యాలయం అని తెలిసి కూడా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం సరైంది కాదని సీనియర్ ఐపీఎస్లు అభిప్రాయపడ్డారు.
సీమాంధ్ర అధికారులు ఇలాంటి వైఖరి అవలంబిస్తే పదేండ్ల్లు ఉమ్మడి రాజధాని కొనసాగడం కష్టమేనని తెలంగాణవాదులు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రికి కేటాయించిన భవనం విషయంలోనే ఇలా ప్రవర్తించారంటే మామూలు వ్యక్తుల విషయంలో వారి వైఖరి ధోరణి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వంసకర చర్యలను సహించేది లేదని తెలంగాణవాదులు, ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. తాము క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా పనిచేశాం తప్ప ప్రాంతీయాభిమానం ప్రదర్శించిన దాఖలాలు లేవని, కానీ గ్రేహౌండ్స్ పోలీసుల ప్రవర్తన పోలీసు క్రమశిక్షణకు అర్థమే తెలియనట్టుఉందని తెలంగాణ పోలీస్ సిబ్బంది ఈసడించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే సీమాంధ్ర ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా కనిపిస్తున్నదని విద్యా, ఉద్యోగ, కార్మిక జేఏసీలు మండిపడ్డాయి.
1. ఎస్ఐబీ కార్యాలయంలో తవ్వి తీసుకెళ్లిన తలుపు
2. ఫ్యాన్లు, లైట్లు తొలగించిన తర్వాత ఫాల్స్ సీలింగ్
3. కిటికీకి ఉన్న గ్రిల్స్, అద్దాలు తొలగించి తీసుకెళ్లిన దృశ్యం
4. స్వీచ్ బోర్ట్ పీకి కరెంటువైర్లు లాగి..
5. బాత్రూంలో తొలగించిన టాయిలెట్ బేసిన్
రాష్ట్ర విభజన చట్టంలో రాజధానిలోని భవనాల రక్షణ కేటాయింపు పూర్తి బాధ్యతలను గవర్నర్కు అప్పగించారు. ఇరు రాష్ర్టాలకు అవసరమైన భవనాల కేటాయింపు వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు. ఆయన ఈ భవనాలు, ఆస్తులకు సంరక్షకుడుగా ఆ చట్టంలో పేర్కొన్నారు. తాజాగా ఒక ప్రభుత్వ భవనాన్ని, అందునా వారసత్వ సంపదగా వచ్చిన భవనాన్ని విధ్వంసం చేసిన అంశంమీద ఆయన వెంటనే జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేటాయించిన భవనం విషయంలోనే ఇలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తించడాన్ని అనుమతిస్తే ముందు ముందు అవాంఛనీయ ఘటనలకు తెరతీసినట్టు అవుతుందని న్యాయకోవిదులు కూడా
హెచ్చరిస్తున్నారు.
సీమాంధ్ర పోలీసుల విచ్చలవిడికి ఇది పరాకాష్ట. ఈ శాఖలో క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయింది. ఈ సీమాంధ్ర పోలీసులకు నియమ నిబంధనలు ఏవీ పట్టవని దీనితో రుజువైంది. మార్పు జరుగుతున్న ఈ సమయంలో మరింత సంయమనంతో ఉండాల్సిన పోలీస్ అధికారులు తమ అలవాట్లను సీఎంకు కేటాయించిన ఆఫీస్ను ఖాళీ చేయడంలో అరాచకాలకు పాల్పడటం ద్వారా ప్రదర్శించారు. తమను ప్రశ్నించే అధికారాలు ఎవరికీ లేవనే ధీమాతో పోలీస్ యంత్రాంగం ఇలా వ్యవహరిస్తున్నది. మొదటినుంచి సీమాంధ్ర పోలీసుల తీరు ఇలాగే ఉంది.
తెలంగాణ సీఎంకు కేటాయించిన ఎస్ఐబీ భవనంలోని సామాగ్రి, వస్తువులను బందిపోట్లుగా తీసుకెళ్లడం క్రిమినల్ చర్య. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సీమాంధ్ర పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. వెంటనే వీరిపై దొంగతనం కేసు నమోదు చేసి, విచారణ జరపాలి. ఇలాంటి బందిపోట్లపై గవర్నర్ జోక్యం చేసుకొని చర్యలకు ఆదేశించాలి. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన వీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే తెలంగాణ నవ సమాజం తగిన బుద్ధి చెప్తుంది. ఇక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని ఏ మాత్రం కించపరిచేలా వ్యవహరించినా ఎలాంటి చర్యలకైనా సిద్ధం. ఇలాంటి బందిపోటు వ్యవహారాలకు పాల్పడి సీమాంధ్ర నైజాన్ని బయటపెట్టుకున్నారు. ఇలాంటి వారి వల్లే తెలంగాణ ప్రజలు గెట్ అవుట్ అంటున్నారు.
1969లో తెలంగాణ వస్తే హైదరాబాద్ను కాల్చివేసి పోతామన్న కాసు బ్రహ్మానందరెడ్డికి ఎస్ఐబీ ధ్వంసం చేసిన వారంతా వారసులే. గౌరవ ముఖ్యమంత్రికి గ్రీవెన్స్కు కేటాయించిన భవనంలో చిల్లర వేషాలు, విధ్వంసకర చర్యలకు పాల్పడ వారు తెలంగాణ ప్రజలతో ఎలా కలిసుంటారు? ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామని అంటూనే ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేది లేదు. తెలంగాణ ప్రజలు ఇలాంటి సీమాంధ్ర పెద్దలు, అధికారులను తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుంది. రాష్ట్రంకోసం పోరాడిన తెలంగాణ ప్రజలు ఏనాడూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదు. శాంతియుతంగా రాష్ట్రం సాధించాం. సీమాంధ్ర అధికారులు వారి కుట్రపూరితమైన బుద్ధిని బయటపెట్టుకున్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా భవనాల పంపిణీ దగ్గరి నుంచి సీమాంధ్ర ఆధిపత్యం కొనసాగుతున్నది. పైళ్లు దగ్ధం చేయడం, కార్యాలయాల కేటాయింపులో పక్షపాతం వహించడం, పనికిరాని కార్యాలయాలను తెలంగాణకు ఇవ్వడం, ఫర్నీచర్ ఎత్తుకెళ్లడంలాంటివి 60ఏళ్ల దోపిడీకి కొనసాగింపుగానే చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా కార్యాలయాల్లోని వస్తువులను దోచుకెళ్లడంపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఉమ్మడి రాజధాని వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. సీఎంకు కేటాయించిన ఎస్ఐబీ భవనంలో పోలీస్ అధికారులు సామాగ్రి ఎత్తుకెళ్లడం, విద్యుత్, తదితర వ్యవస్థను నిర్వీర్యం చేయడం పూర్తిగా కుట్రపూరితమే. ఇలాంటి రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో