హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమ బడాబాబుల కబంధహస్తాల్లో ఉందని సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో సురేష్ బాబు, అల్లు అరవింద్, దాసరి నారాయణరావు, అశ్వినీదత్, చిరంజీవి వంటి వారి పలుకుబడే భారీగా నడుస్తోందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో ఒక్కొక్కరికి 20 ఇళ్లకు పైగా ఉన్నాయన్నారు. అందుకే కొత్త రాష్ట్రంలో ఇలాంటి బడా నిర్మాతలకు ఫిల్మ్ స్టూడియోల కోసం స్థలాలు ఇవ్వొద్దని చిన్న నిర్మాతలకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తాము మళ్లీ బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. కొత్త రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఏర్పాటుపై పెద్దలను చర్చలకు పిలవద్దని..ఇక్కడ మౌళిక వసతులున్న దాసరి, అల్లు అరవింద్, చిరంజీవి, సురేష్ బాబు లాంటి వారిని కమీటీల్లో ఉంచొద్దని నట్టికుమార్ తెలిపారు. 200 మంది చిన్న నిర్మాతలు, సాంకేతిక నిపుణులతోనే చర్చలు జరపాలని సూచించారు. చిన్న నిర్మాతల కోసం ప్రభుత్వమే స్టూడియో నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను వ్యాపార సముదాయాలుగా వాడుతున్న వారి భూములను లాక్కోవాలన్నారు. కొత్త రాజధానితో తమకు సంబంధం లేదని , వైజాగ్ సినీ క్యాపిటల్ అయితే సరిపోతుందన్నారు. హైదరాబాద్, విశాఖ ప్రాంతాల్లో తమ సినిమా షూటింగ్స్ జరుపుతున్నామని పేర్కొన్నారు. విభజన విషయం తెలిసిన తర్వాత కూడా ఏపీఎన్జీవోలు ఎందుకు సమ్మె చేశారో అర్థం కాలేదన్నారు. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలతో మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన టాలీవుడ్ రూట్ మ్యాప్ ఏ విధంగా మారుతుందోనని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి.
- Source: 10tv