చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా..? లేక తెలంగాణకు ప్రతిపక్ష నేతనా? అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నాయకులు స్థాయి మరిచి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కోసం సద్విమర్శలు చేసినా స్వీకరిస్తామని.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. హెరిటేజ్ పాలు తాగే నీ పద్ధతి మార్చుకో.. లేకుంటే నీబండారం బయట పెడతామని ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని హెచ్చరించారు. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే సహించేది లేదని ఎర్రబెల్లి దయాకర్రావుపై మండిపడ్డారు. గవర్నర్కు అధికారాలు అప్పగించాలని రాష్ర్టానికి కేంద్రం రాసిన లేఖపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలమంతా ఆందోళన చేశామన్నారు. తమ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, దీంతో హోంశాఖ మంత్రి రాజనాథ్సింగ్ ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారన్నారు.
పొన్నాల లేఖ రాయడంపై స్పం దిస్తూ.. పొన్నాలా.. 21 అంశాలపై లేఖ రాశావు. 101 అంశాలపై నీబండారం బయటపెడతా అని హెచ్చరించారు. సీమాంధ్ర నాయకులు రాష్ట్రం ఏర్పడకముందు అనేక అపోహలు సృష్టించారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని.. దాడులు చేస్తారని పుకార్లు సృష్టించారని కానీ, ఇప్పటి వరకు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు రాలేదన్నారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన తీరు చూస్తే తెలంగాణకు వ్యతిరేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. సమగ్ర సర్వేపై పలువురు చేస్తున్న విమర్శలు.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణలో నాలుగు లక్షల మంది ఉద్యోగులున్నారని, ఒక్కో ఉద్యోగి 20 కుటుంబాలు సర్వే చేస్తారని అంతా ఒక్క రోజులో పూర్తి అవుతుందన్నారు. బీసీ వాదినని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏపీలో ఈ సర్వే ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో