నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2014 – 2015 వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు అనుకున్న విధంగానే అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమయిన అయిష్టతను, వివక్షను బయటపెట్టుకుంది. తెలంగాణ పట్ల మొదటినుండి స్పష్టమయిన వ్యతిరేకతతో ఉన్న నరేంద్రమోడీ, ఆయన సన్నిహితుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చక్రం తిప్పుతున్న ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణకు రాబోయే రోజుల్లోనూ అన్యాయమే జరుగుతుంది అన్నదానికి ఇదో ఉదాహరణ.
ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో వరాలజల్లు కురిపించిన అరుణ్ జైట్లీ తెలంగాణకు మాత్రం కంటితుడుపుగా ఒక్క ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పోర్టు అభివృద్ది, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, అనంతపురం జిల్లా హిందూపూర్ లో నేషనల్ కస్టమ్స్ మరియు ఎక్సయిజ్ అకాడమీని నెలకొల్పాలని నిర్ణయించారు. ఇక వీటితో పాటు ఎయిమ్స్, ఐఐటీలను కేటాయించారు.
ఇంత స్పష్టంగా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న దాఖలాలు గానీ ..తెలంగాణ ప్రాధాన్యాలకోసం పట్టుబడుతున్న దాఖలాలు గానీ కనిపించడం లేదు. సీమాంధ్రలో బీజేపీకి ఆదరణ లేకున్నా ..ఆది నుండి తెలంగాణలో బీజేపీని ఆదరిస్తున్నా తెలంగాణ బీజేపీ నేతల మాట కేంద్రంలో చెల్లడం లేదు. ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తే తెలంగాణ నేతల మూలంగా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.
తెలంగాణకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా వివక్ష చూపిన మోడీ భవిష్యత్ లో దానిని కొనసాగిస్తాడని అర్ధం అవుతోంది. తెలంగాణ సమాజం కేంద్రం సహాయ నిరాకరణను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బీజేపీ నేతల మీద వత్తిడి తీసుకువచ్చి తద్వారా కేంద్రంలో కదలిక వచ్చేలా చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తనకు నిరాశ కలిగించిందని తెలిపారు.
-సందీప్ రెడ్డి కొత్తపల్లి