చెప్పేవి శ్రీరంగ నీతులు ..దూరేవి సాని కొంపలు అని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్నో ఏళ్ల నుండి ..ఎందరో అనుభవాల నుండి సామెతలు పుడతాయి. భారతీయ జనతా పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడుల(ఎఫ్.డి.ఐ)ను ఆహ్వానిస్తే పార్లమెంటు వేదికగా నానారభస చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను విదేశాల చేతుల్లో పెట్టడమే అని నానా గగ్గోలు పెట్టారు.
అంత పెద్ద ఎత్తున హంగామా చేసిన బీజేపీ ఇప్పుడు అధికారం చేతికి దక్కినవెంటనే మొదటి బడ్జెట్ లోనే ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కీలకమయిన రక్షణ, భీమా రంగాలలో ఎఫ్.డి.ఐలను 26 శాతం నుండి 49 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక్కడితో ఆగిపోకుండా తయారీ రంగంలో కూడా ఎఫ్.డీ.ఐలను ఆహ్వానిస్తూ సంకేతాలు పంపింది.
స్వదేశీ జపం చేసే భారతీయ జనతా పార్టీ నేతలు పూర్తి మెజార్టీ ఇస్తే ఏదో ఒరగబెడతాం ..సంకీర్ణ ప్రభుత్వాల మూలంగా తాము ఏమీ చేయలేకపోతున్నాం అని గతంలో వాపోయేవారు. ఇక ఎన్నికలకు ముందే ఏదో చేస్తానని ప్రజలకు అరచేతిలో స్వర్గం చూయించిన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సొంత మెజార్టీ ఉన్నా ..ధైర్యంగా ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారం రాకముందు ఒకమాట ..వచ్చిన తరువాత ఒకమాట మాట్లాడడం రాజకీయ నేతలు మార్చుకోనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు.
- సందీప్ రెడ్డి కొత్తపల్లి