-ఎన్ వేణుగోపాల్
అంతరాల వ్యవస్థలో పాలకులు కావాలంటే న్యాయబుద్ధీ, మానవత్వమూ వదులుకోవలసి ఉంటుంది. ఏ విధానమైనా, ఆచరణ అయినా వ్యవస్థలో కొన్ని వర్గాలకే లాభదాయకంగా, మరికొన్ని వర్గాలకు నష్టదాయకంగా ఉంటాయి గనుక ఏ విధానాన్నీ న్యాయబద్ధంగా వివరించడం సాధ్యం కాదు. కొన్ని వర్గాలకు జరిగే నష్టాన్ని విస్మరించడానికి మానవతాదృష్టినీ వదులుకోక తప్పదు. అందువల్లనే ‘తటస్థంగా కనిపించే సూత్రబద్ధ, హేతుబద్ధ, చట్టబద్ధపాలన’, ‘ఎక్కువమందికి ఎక్కువ మంచిచేసే కార్యక్రమాలు’ అనే సూత్రాలు ఆధునిక పాలనలోకి వచ్చి చేరాయి. మహాఘనత వహించిన భారత పాలకులకు మాత్రం ఆ హేతుబద్ధత చట్టబద్ధత అన్నా, బహుజన హితాయ అన్నా కంటగింపు. వారికి కావలసింది తమ ఆశ్రితుల ప్రయోజనాలు. అవి ఎంత మోసపూరితంగా సాధించినా ఫరవాలేదు. పిడికెడు మంది తమవారికోసం కోట్లాది బహుజనులను మోసగించినా, చంపివేసినా ఫరవాలేదు.
ఈ న్యాయబద్ధత లేని, మానవత్వం లేని భారత పాలకవర్గ విధానాలకు నిదర్శనం కావాలంటే పోలవరం ప్రాజెక్టుకు మించిన ఉదాహరణ మరొకటి ఉండబోదు. సమాజం చేత ఆ విషగుళికను మింగించడానికి సాంకేతిక వ్యవస్థలతో, న్యాయవ్యవస్థలతో, చట్టసభలతో ఆడించిన నాటకాలు మన కళ్లముందర సాగుతున్నాయి. పోలవరం ఉదంతం పాలకుల దుర్మార్గానికి మాత్రమే కాదు, మౌనం ద్వారా ఆ దుర్మార్గాన్ని సాగనిచ్చే మనందరి సామాజిక నిర్లిప్తతా దౌష్ట్యానికి కూడ చిహ్నంగా నిలుస్తున్నది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు, విద్యుదుత్పత్తి వంటి ప్రయోజనాలున్నాయని పాలకవర్గాలు చెపుతున్నదానిలో సగానికన్న ఎక్కువ అబద్ధాలు, అర్ధసత్యాలు. ప్రస్తుతం పోలవరం ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెపుతున్నారు. కాని పోలవరం నిర్మాణ ఆలోచనలు అటకెక్కిన 1980-2005 కాలంలోనే ఈ భూమిలో చాల భాగానికి సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇవాళ కొత్తగా పోలవరం ద్వారా సాగునీరు అందే భూమి అతి స్వల్పం. లేదా, ఇప్పటికి ఒక పంటకు అవకాశం ఉన్నచోట రెండు పంటలకు, లేదా రెండు పంటలకు అవకాశం ఉన్నచోట మూడు పంటలకు నీరు అందవచ్చు. కాని దానివల్ల అదనంగా మురుగునీటి సమస్యలు, భూమిలో ఉప్పు పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పోలవరం నుంచి వచ్చే నీటిలో 80 టిఎంసి నీటిని విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజికి చేర్చి, తద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని చెప్పడం మరొక అబద్ధం. నిజానికి ఈ ప్రకటనలో ఇమిడి ఉన్న మోసం ఎంత దుర్మార్గమైనదో చెప్పడానికే వీలులేదు. ఈ కారణం చెప్పి పోలవరం దగ్గర 80 టిఎంసి తీసుకున్నప్పటికీ గోదావరి జలాలను కృష్ణా బేసిన్లో కలుపుతున్నందువల్ల, కృష్ణానది మీద ఎగువ రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వవలసి వస్తుంది. అలా తెచ్చిన 80 టిఎంసిల నీటిలో ప్రకాశం బ్యారేజి దగ్గరికి చేరేసరికి ఆంధ్రప్రదేశ్కు మిగిలేవి 45 టిఎంసిలు మాత్రమే. అవి కూడ రాయలసీమ పేరు చెప్పి తెస్తున్నారు. కాని అవి రాయలసీమకు చాల దిగువన కృష్ణానదిలో కలుస్తున్నాయి గనుక కిందికే వెళ్తాయి గాని పైకి ఎక్కవు.
అంటే కృష్ణా డెల్టా పైన ఉన్న ప్రాజెక్టులలో ఆ మేరకు తన వాటా వదులుకుని రాయలసీమకు ఇవ్వాలి. కాని కృష్ణా డెల్టా శక్తులు అటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించబోవని గత ఆరు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తున్నది. అంటే ప్రకాశం బ్యారేజి కింది భూములకు అదనంగా 45 టిఎంసిల నీరు, అంటే మరొక పంట, లేదా అక్కడ పారిశ్రామిక అవసరాలకు నీరు అందడం తప్ప జరగబోయేదేమీ లేదన్నమాట. రాయలసీమ దుర్భిక్షాన్ని సాకుగా చూపి కృష్ణా డెల్టాకు మరింత నీరు కట్టబెట్టబోతున్నారన్నమాట.
పోలవరం ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి సాంకేతిక కారణాలు, మానవీయ కారణాలు మాత్రమే కాదు, అసంఖ్యాకమైన చట్టపరమైన వివాదాలున్నాయి. ఇప్పటికీ సుప్రీంకోర్టు ముందర అపరిష్కృతంగా ఉండిపోయిన వ్యాజ్యాలున్నాయి. అసలు ఈ ప్రాంతం షెడ్యూల్డ్ ప్రాంతం గనుక రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ కింద అక్కడి ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొక్కివేసి పోలవరం ముందుకు వెళ్లదలచింది.
ఇక్కడ అడగవలసిన ప్రశ్న ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి అని. దేశంలో గత ఆరు దశాబ్దాలలో “అభివృద్ధి” పథకాల వల్ల ఆరు కోట్ల మంది నిర్వాసితులయ్యారని అందులో కనీసం రెండు కోట్ల మంది ఆదివాసులని ఒక అంచనా. దేశ జనాభాలో 8 శాతం ఉన్న ఆదివాసులు, నిర్వాసితులలో మాత్రం 30 శాతం పైన ఉన్నారంటే ఎవరి అభివృద్ధికి వాళ్లు సమిధలయిపోయారో అర్థమవుతుంది. ఆదివాసులు ఎప్పటికీ వారి చింకిపాతలతో, రోడ్లు లేని, విద్యుత్తులేని, కారడవుల్లో ఉండాలా వారికి అభివృద్ధి అక్కరలేదా అని బుద్ధిమంతులు మరొక ప్రశ్నవేస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏమిటనే మౌలిక ప్రశ్న కూడ వేయనక్కరలేదు. ఆదివాసులను అభివృద్ధి చేయాలంటే వారి స్వస్థలాల నుంచి నిర్వాసితులను చేస్తే తప్ప కుదరదా ఇంతకూ దేశంలో ఇప్పటివరకూ ఏ ఒక్క అభివృద్ధి పథకం లోనూ నిర్వాసితులకు గౌరవప్రదమైన, సంపూర్ణమైన పునరావాసం దొరకలేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం నిర్వాసితులలో ఇప్పటికీ పునరావాసం దొరకని వారున్నారు. భూమికి సమానమైన భూమి ఇవ్వాలనే కొత్త పునరావాస చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు ఇవ్వగలిగిన భూమీ లేదు. ఇవ్వాలనుకున్నా, నిర్వాసితులవుతున్న ఆదివాసులకు పట్టాలు లేవు గనుక ఎగ్గొట్టి, వారిని బిచ్చగాళ్లుగా మార్చడానికి ప్రభుత్వానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. కనుక ఇది అభివృద్ధికి దారితీసే పథకం కాదు, అణచివేతకు, అన్యాయానికి దారితీసే పథకం.
తమ ఎన్నికల వ్యయానికి మదుపు పెట్టిన కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడడమే రాజకీయపార్టీల విధ్యుక్తక్తధర్మం అయిన వేళ ఈ వివాదంలోకి రాజకీయాలు ప్రవేశించాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఈ పాపంలో అన్ని రాజకీయపక్షాలకూ భాగం ఉంది. సోమవారం నాడు రాజ్యసభ చర్చలో “చాల కాలంగా మోసం చేస్తున్నాం. ఇకనైనా ఆపుదాం” అని కె. కేశవరావు ఎందుకు అన్నప్పటికీ, అది అక్షరసత్యం.
ముంపుకు గురయ్యే ఆదివాసి గ్రామాలు తెలంగాణలో ఉండడం, ఆ గ్రామాల గ్రామ సభలన్నీ తెలంగాణలోనే ఉంటామని తీర్మానాలు చేయడంతో ఇది తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సమస్యగా కూడ మారింది. డిజైన్ మార్చాలని వాదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, తదితర సంస్థలు, అసలు పోలవరం నిర్మాణమే వద్దని వాదిస్తున్న ఇతర ప్రజాసంస్థలు జరిపిన ఆందోళనలతో రాష్ట్ర విభజనకు ముందు ఇది ప్రధాన సమస్య అయింది.
అవి ముంపు గ్రామాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మారుస్తున్నాం అని వాదించదలచుకుంటే, ఒరిస్సా, చత్తీస్గడ్లలో కూడ ముంపు గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రాల సరిహద్దులు మార్చడం అధికరణం 3 ప్రకారం రాష్ట్రపతి అనుమతితో జరగవలసిన పని అయినప్పటికీ ఆ రాజ్యాంగ నియమాలేవీ పాటించలేదు.