ఏలే వాలకం తొలి అడుగుల్లోనే తెలిసిపోతుందంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ నెల రోజుల తొలి అడుగులు మంచిమార్కులు సాధించి పెట్టాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇప్పటివరకు చూసిన ముఖ్యమంత్రులకంటే ఎలా భిన్నమైనవారో, ఒక కొత్త రాష్ట్ర నాయకునిగా ఏమి చేయగలడో ఈ నెలరోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎరుకపరిచారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లో కేసీఆర్ చేసిన ప్రసంగం అధికార ప్రతిపక్షాలను సైతం మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్ర చారిత్రతక అవసరాన్ని, అస్తిత్వకాంక్ష మూలాలను, సమస్యల లోతులను తడిమి, తాను ఏమి చేయదల్చుకుంటు న్నారో చెప్పినప్పుడు సభ యావత్తూ ఏకీభావంతో గొంతుకలిపింది.
తెలంగాణ నాయకత్వంపై మనలో మనకే బలపడిపోయిన ఒక చిన్నచూపును, సందేహ దష్టిని కేసీఆర్ పటాపంచలు చేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ వడివడిగా అడుగులువేస్తూ అనతికాలంలోనే ఆయన రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగారు. సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం, సమస్యలకు సంబంధించిన లోతైన అవగాహన, వేగంగా నిర్ణయాలు చేయగల ైస్థెర్యం కేసీఆర్ను ఒక బలమైన, దక్షత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలిపాయి. పోలవరం వివాదం, విద్యుత్ ఒప్పందాల రద్దు, కష్ణా జలాల విడుదల, గురుకుల ట్రస్టు భూముల వ్యవహారం, ఫీజు రీయింబర్స్మెంటు వంటి సందర్భాల్లో తెలంగాణకు కేసీఆర్ వంటి నాయకుడు ఎందుకు అవసరమో తెలిసివచ్చింది.
తెలంగాణ నాయకులకు పరిపాలించుకోవడం తెలియదు. తెలంగాణ నాయకుల కంటే మనం ఉన్నతమైన వాళ్లం. వారు నేర్చుకోవలసినవాళ్లు. మనం నేర్పేవాళ్లం. మనం చెప్పే వాళ్లం, వాళ్లు వినేవాళ్లు అన్న భావన ఇంతకాలం మనల ను పరిపాలించిన సీమాంధ్ర నాయకత్వాల్లో ఉండేది. ఆ చిన్నచూపు గత ముఖ్యమంత్రులు తమ మాటల్లో, చేతల్లో అనేకసార్లు ప్రదర్శిస్తూ వచ్చారు. శాసనసభలోనే బాహాటంగా తెలంగాణ నాయకులను అవమానిస్తూ వచ్చారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా కూడా తెలంగాణ నాయకుల కు ఎక్కడలేని పేర్లు పెట్టి వ్యాఖ్యానించే అహంకారపూరిత ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది.
యాభయ్యేడేళ్ల పాలనలో తెలంగాణ నాయకులెవరినీ పట్టుమని పదిరోజులు అధికారంలో ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వా త కూడా మీడియా ఇదే దురహంకారాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది. ప్రజల తీర్పుతో అధికారాన్ని చేపట్టి రెండు వారాలు కూడా పూర్తి చేసుకోని కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలింది. కానీ ఈ నెల రోజుల స్వయంపాలన తెలంగాణ నాయకత్వం శక్తి సామర్థ్యాలను లోకానికి చాటి చెప్పింది. అవకాశంవస్తే నాయకత్వం ఎంత సమర్థంగా, నిబ్బరంగా, చురుకుగా పనిచేయగలదో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రుజువు చేశారు. మునుపటి నాయకులకంటే ఉత్తమ పాలన అం దించగలరన్న నమ్మకాన్ని కేసీఆర్ కలిగించగలిగారు. చంద్రబాబు, ఆయన అవశేష అనుచర గణం చేస్తున్న కుయుక్తులను సమర్థంగా తిప్పికొట్టగలిగారు.
అవిశ్రాంతంగా ఆయన నిర్వహించిన సమీక్షలు, ఆయన మార్గదర్శన చేస్తున్న తీరు, ఆయన అందిస్తున్న ధైర్యం అధికారులను కూడా ఉరుకులు పెట్టిస్తున్నది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే విషయమై ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేసిన ప్రయత్నం కూడా తక్కువేమీకాదు.
వక్ఫ్ భూములను, గురుకుల్ ట్రస్టు భూములను కబ్జా నుంచి విముక్తి చేయడం, మెట్రో రైలు మార్గంపై సమీక్ష చేయడాన్ని కూడా వక్రీకరించి, ఇదేదో ఇన్వెస్టర్లను భయోత్పాతానికి గురిచేస్తున్నదన్న భావన కలిగించడానికి కొందరు వక్రబుద్ధులు ప్రయత్నిస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రజల భూములను అప్పనంగా కొట్టేసి కోటలు కట్టినవారు ఇన్వెస్టర్లయినా ఎలా వదిలేస్తారు? హైదరాబాద్లో ఇప్పటిదాకా జరిగిన అక్రమాలన్నింటినీ చూసీ చూడనట్టు వదిలేట్టయితే స్వరాష్ట్రం సాధించి ఏమి ప్రయోజనం? హైదరాబాద్లో ఏదయినా మంచి పనిచేయడానికి లేదా ఒక మంచి సంస్థను ఏర్పాటు చేయడానికి పట్టుమని పది ఎకరాల భూమి లేకుండా చేశారు? ఈ దుస్థితిని సరిదిద్దే ప్రయత్నమే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు.
హైదరాబాద్ తనను తాను కోల్పోయిన చోట అస్తిత్వ పతాకాలను ఎగురవేయడానికి కేసీఆర్ కషి చేస్తున్నారు. రుణ మాఫీ, దళితులకు ఉప ప్రణాళిక అమలు, భూమి కేటాయింపు, ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై అధ్యయనం, కార్యాచరణ దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు, మంత్రివర్గ సభ్యులంతా చురుకుగా ప్రజల మధ్య వెళ్లి వారికి వీలైనంత అండగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి తొలి అడుగులు మాత్రమే. చేయాల్సిన పను లు, నడవాల్సిన దూరం, ఎదుర్కోవాల్సిన సవాళ్లు చాలా ముందున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితాలు ప్రతి గడపను తాకిన రోజు మాత్రమే అస్తిత్వ పతాక సగర్వంగా రెపరెపలాడుతుంది. కేసీఆర్ స్వప్నం సాకారమవుతుంది.