నగరంలోని ప్రభుత్వ భూముల్లో ఒక్క ఇటుక పేర్చినా కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు కమిషనర్ సోమేష్కూమర్ ప్రత్యేక కార్యచరణ సిద్ధంచేశారు. ఉద్యోగులకు లంచాలిచ్చి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అనంతరం కోర్టు స్టేల మాటున వాటిని కొనసాగించడం నగరంలో మామూలైపోయింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలు అటు ప్రభుత్వానికి, ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు తలనొప్పిగా తయారవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచివేస్తే ఈ సమస్య ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఓ నిర్ణయానికొచ్చారు. అందుకే మాన్సూన్ ఎమర్జెన్సీ బందాల తరహాలోనే సర్కిల్కు ఒకటి చొప్పున ఎన్ఫోర్స్మెంట్ బందాలను రంగంలోకి దింపాలని నిశ్చయించారు.
నగరంలో ఏటా అక్రమ నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీకి పది నుంచి 12వేలవరకు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే ప్రతినెలా పదుల సంఖ్యలో కూల్చివేతలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంటు బందాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా పనిచేయడంలేదు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకాని(బిపిఎస్)కి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు రావడం, గురుకుల్ ట్రస్టు భూముల్లో వందల సంఖ్యలో ఏర్పడిన ఇళ్లే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీపీఎస్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 40వేలు చెరువులు, కుంటల్లోని ఇళ్లకు సంబంధించినవి కావడంతో వాటి క్రమబద్ధీకరణ జరగలేదు. ప్రస్తుతం వాటిల్లో నివసిస్తుండడంతో తొలగింపు కూడా సాధ్యం కావడం లేదు. గురుకుల్ ట్రస్టు భూముల్లోని ఇళ్ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. అంతేకాదు నగరంలోని చెరువులు, కుంటలన్నీ కనుమరుగై వందల సంఖ్యలో కాలనీలు ఏర్పాటయ్యాయి. మొదట్లోనే అధికారులు వీటిని అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదికాదు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే హిమాయత్సాగర్, గండిపేట వంటి మంచినీటి జలాశయాలు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదముంది.
ప్రత్యేకఫోర్స్
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను నిరోధించాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలివ్వడంతో కమిషనర్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సర్కిల్కు ఒకటి చొప్పున స్థానిక ఏసీపీల సారథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ బందాలతో కూడిన వాహనాలు, కూల్చివేతలకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను కూడా సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే వెళ్లి కూల్చివేత చేపట్టేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టంచేశారు. త్వరలోనే ఈ వాహనాలు సిద్ధం అవుతాయని, ఇక మీదట అక్రమ నిర్మాణాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఒకవేళ అక్రమ నిర్మాణాలను నిరోధించని పక్షంలో స్థానిక ఏసీపీతోపాటు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో