తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండు మూడేళ్లల్లో మిగులు విద్యుత్ సాధించాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాలో మెగా సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వెయ్యి మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేయనుంది. ఇదిపూర్తిగా తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఐఐసీ) పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్లాంట్ ఏర్పాటు కోసం మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలంలో 5వేల ఎకరాల స్థలాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఒక్క మెగావాట్ విద్యుదుత్పత్తికి రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రాజెక్టు వ్యయం రూ.6 వేలకోట్ల పైమాటే. ఐతే ఈ ప్రాజెక్టు ప్రణాళిక దశలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్చంద్ర టీ మీడియాకు తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తికి తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read More »