పీవీ నరసింహారావు తెలంగాణ నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు. దేశ రాజధానిలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన రాజకీయ దురంధరుడు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఆర్థిక సంస్కరణల కోసం మొట్టమొదటిసారి రాజకీయేతర ఆర్థికవేత్తను ఆర్థికమంత్రిగా తెచ్చుకున్న దార్శనికుడు. ఆ తర్వాత ఆ ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ దేశానికి ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. విదేశాంగమంత్రిగా, దేశ జ్ఞాన, నిపుణతల స్థాయి పెంచే మానవవనరుల అభివద్ధి శాఖ రూపకర్తగా, ఆ పదవికే వన్నె తెచ్చిన వాడిగా వీపీ నరసింహారావు ప్రపంచ ఖ్యాతి పొందినవాడు. కానీ పీవీ నరసింహారావు సమాధి నెక్లెస్రోడ్డు చివరన విసిరేసినట్టున్న ప్రాంతంలో ఉంటుంది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే పనిచేసిన ఎన్.టి.రామారావు సమాధులు, స్మారకాలు, గార్డెన్లు నెక్లెస్రోడ్డు నడి మధ్య లో ఒక తోటలాగా సందర్శన ప్రాంతంగా ఎందుకు ఉంటుంది.
చెన్నారెడ్డికైతే ఈ ప్రాంతమేది దొరకక ఏదో మూలన సమాధి ఎందుకు ఉన్నది. దేశ ప్రధాని అయినప్పటికీ పీవీ విగ్రహాలు ఎక్కడా కనబడవేమి? చెన్నారెడ్డి ప్రజారంజక పాలకుడిగా కీర్తి గడించినప్పటికీ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆయనకు ప్రధాన ప్రాంతంలో ఆరడుగుల నేల దొరకలేదు. వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహాలు హైదరాబాద్ నిండా ఉంటాయి. ముఖ్యమంత్రిగానే పనిచేసిన టంగుటూరి అంజయ్య ఒక్క విగ్రహమూ కనబడదేమి? పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఈ కొత్త ప్రశ్నలు మొలవాలి. ఎందుకంటే స్వరాష్ట్రంలో తెలంగాణ మొదటిసారి పీవీ జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నది. వలసాధిపత్యాన్ని బద్దలుకొట్టి సుదీర్ఘ పోరాటం, రాజకీయ ఉద్యమం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కల సాకారమయింది. అయినా ఆధిపత్యాన్ని బద్దలుకొట్టి స్వరాష్ట్రం సాధించుకున్నాం కానీ ఆధిపత్య చిహ్నాలు అట్లాగే కొనసాగడం మీద ఈ సందర్భంలోనే ప్రశ్నలు మొలుస్తాయి. ముందు పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. ఈ చర్య అస్తిత్వ విశ్వాసాన్ని పాదుకొల్పుతుంది.
మన వారెవరో? పరాయివారెవరో? గెట్టు గీసి నిలుపుతుంది. ట్యాంక్బండ్ మీద విగ్రహాల మీద వెల్లువెత్తిన ధర్మాగ్రహ మూలాలు సరిగ్గా ఇలాంటి అస్తిత్వ భావనల్లో ఉంటాయి. ఒక ప్రాంతం మీద ఆధిపత్యం సాధించాలంటే ఆ ప్రాంతాన్ని న్యూనత గల ప్రాంతంగా, ఆ ప్రాంతంలో సమర్థులు, ప్రముఖులు, విజ్ఞులు లేనట్టుగా, మహనీయులు లేనట్టుగా మైకం కమ్మించడానికి ఆధిపత్య పనిగట్టుకొని ప్రయత్నిస్తుంది. ఎడ్డి సమాజం, గుడ్డి సమాజం అని వెక్కిరిస్తుంది. ఒక ప్రాంతపు మహనీయులను, మహానుభావులను విస్మరణలోకి నెట్టి, ఆధిపత్య ప్రాంతపు అంగుష్టమాత్రుల ను కూడా మహాపురుషులను చేస్తుంది. విలీనం తర్వా త సరిగ్గా ఇదే జరిగింది. తెలంగాణ మహానేతలు, ఏలికలు మరుగుజ్జులై, కవులు, కళాకారులు, క్రాంతిదర్శులకు దిక్కులేకుండా పోయి, కేవలం ఆంధ్ర ప్రాంతపు వైభవమే ట్యాంక్బండ్ మీద, నెక్లెస్రోడ్డు చుట్టూ, హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో ప్రతీకలై వెలిశాయి. సందర్భం ఎట్లాంటిదంటే అస్తిత్వ ఉద్యమ విజయం తర్వాత పీవీ జయంతిని అధికారికంగా జరిపినట్టే మన వైభవాన్ని పునఃప్రతిష్టించుకోవాలి. మరోవేపు ఆధిపత్య చిహ్నాలను, ప్రతీకలను, వైభవంగా ప్రతిష్టించిన వాటిని తిరస్కరించగలగాలి. అదే భవిష్యత్తులో అస్తిత్వం పాదుకోవడానికి ఒక ప్రేరణ అవుతుంది.
రొమిల్లా థాపర్ మాటల్లో ఏ ప్రతీకలు, ఏ స్థలకాలాల్లో ఎందుకు రూపుదిద్దుకుంటాయో తెలుసుకోవడం అస్తిత్వాల తక్షణ అవసరం. అట్లాగే ఈ ప్రతీకల రూపకల్పన వెనక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలుసుకోవాలి. పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ అయినప్పటికీ, దేశ ప్రధానిగా, సంకీర్ణ ప్రభుత్వాన్ని అయిదేళ్లు నడిపిన మహామేధావిగా ప్రపంచం కీర్తించినప్పటికీ ఆయన తెలంగాణకు కూడా ప్రతీక కాలేకపోయాడు. ఢిల్లీ పీవీని రాజకీయ కారణాలరీత్యా, నెహ్రూ కుటుంబ రాజకీయాల వల్ల తిరస్కరించి పంపింది. అక్కడి సుందర సువిశాల మైదానాల్లో అనేకమంది సమాధులు ఉన్నప్పటికీ పీవీకి అక్కడ చోటు దక్కలేదు.
అట్లాగే చివరికి పురిటిగడ్డ మీద కూడా ఆయనకు అందరికన్నా ఎక్కువ దక్కాల్సిన గౌరవం, ప్రదేశం దక్కలేదు. ఆయన తో పోల్చుకున్నప్పుడు అంగుష్టమాత్రులు హైదరాబాద్లో విగ్రహాలుగా ఊరేగుతుంటే మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎందువల్ల జరుగుతాయి. ఆంధ్ర ఆధిపత్యం కోసం ఎన్టీఆర్ మహానేత అవుతాడు. వారి ప్రయోజనాల కోసమే ఎన్టీఆర్ ఎక్కడ చూసినా ఉంటాడు. అదీ సారాంశం. పీవీ నరసింహారావును తెలంగాణ సాకారం అయిన సందర్భంలో మరొకందుకు గుర్తుపెట్టుకోవాలి. 1969లో తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత 1971లో కాసుబ్రహ్మానందరెడ్డి నుంచి ముఖ్యమంత్రిగా పీవీ అధికారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన భూ సంస్కరణలు చేపట్టారు. ఆంధ్రా భూస్వామ్య లాబీ కాసు బ్రహ్మానందరెడ్డి కుట్రల వల్ల ఏడాదిన్నరకే పదవి కోల్పోయారు. భూసంస్కరణలు ఒక విప్లవాత్మక ప్రక్రియ. దాన్ని వ్యతిరేకించి ఒకసాకుగా భూస్వాములను ఏకం చేసి ఆంధ్రులు మళ్లీ పీఠం ఎక్కారు.ముఖ్యమంత్రులను ఆంధ్ర లాబీ ఎట్లా నిలవనియ్యలేదో? ఇది మంచి ఉదాహరణ.తెలంగాణ వచ్చినందు వల్ల మన రాష్ట్రంలో మననేతల స్మతులకు గౌరవం పెరగాలి. అనివార్యం. అస్తిత్వం అంటే అదే.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో