- సందీప్ రెడ్డి కొతపల్లి
ఓ ఊళ్ల రాములు అని ఉన్నడు. ఆయినకో పెండ్లం, నలుగురు కొడుకులు, ఓ బిడ్డ. ఓ కొడ్కుకు కడుపునొప్పి. ఇంగొగనికి కాలునొప్పి. పెండ్లానికి కండ్లు సక్కగ కనిపియ్యవు. కాని ఇంట్లోళ్లకు ఎవ్వలకు ఏం రోగముందో రాములుకు మాత్రం తెల్వదు. ఎప్పుడడిగినా పిల్లలు ఏదో ఓ మాటజెప్పి తప్పించుకుంటుండ్రు. అసలు విషయం మాత్రం సక్కగ జెప్పరు. దీంతో రాములుకు పైసలు ఖర్సయితుండయి గాని తక్లీఫ్ మాత్రం తక్వయితలేదు.
“తేలు మంత్రం రానోడు పాముకాటుకు మందేసిండని” సామెత. ఇంట్ల ఎవ్వలకు ఏం ఇబ్బంది తెల్వంది రాములు ఏంజేస్తడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే మీద విపక్ష నేతలు, సీమాంధ్ర నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నరు. సంక్షేమ పథకాలు ఎత్తేసేందుకేనని, దీని ఎన్క శాన మోసం ఉందని, అయ్యాల పెండ్లిళ్లు ఉండయి సర్వే ఎట్ల జేస్తరు అని, ఒక్క దినం గాదు శానదినాలు సర్వే జెయ్యాలని నాలికె ఎట్ల తిర్గుతె అట్ల జోలి జెప్పి జనాల తప్పుదారి పట్టించే ప్రయత్నంల బిజీగ ఉన్నరు.
60 ఏండ్ల సంది అధికారం అనుభవించిండ్రు. అడ్డగోలుగ జనం పైసలు కమాయించిండ్రు. వీడు దప్తె వాడు ..వాడు దప్తె వీడు ఎన్నికలొచ్చినప్పుడల్ల జనాలకు సర్కారు అంటే ఫించన్లు ఇచ్చేది. రేషన్ కార్డులు ఇచ్చేది. లోన్లు మాపీ జేసేది అన్నట్లు జేసిండ్రు. ఈడు 70 రూపాయల ఫించను ఇస్తె ఆడు ఇంగో ఐదు రూపాయలు ఎక్వ అని జెప్పి ఓట్లు గుంజుడు. కానీ ఆ ఇచ్చేది అవసరం ఉన్నోనికా ..ఆ ఫించను ఆనికి ఉపయోగపడుతుందా.. అసలు ఎన్ని ఫించన్లు ఇస్తున్నం.. అసలు మన రాష్ట్రంల ఎన్ని కుటుంబాలు ఉన్నయి.. ఎంత మంది ఉద్యోగులు ఉన్నరు.. ఎవడు గొప్పోడు, ఎవడు పేదోడు అన్న మతులావే లేకపాయె. 60 ఏండ్ల తరువాత ఇంత అధ్వాన్నంగ ఉంటదని ఎవ్వలన్న అనుకుంటరా?
తెలంగాణ ప్రభుత్వ సర్వే మీద గుంటనక్కలు ఎన్ని కూతలయిన కూయొచ్చు. సీమాంధ్ర తాబేదార్ల మోచేతి నీళ్లు తాగే ముఠాలు ఎన్ని ఆరోపలణలు అయినా చేయొచ్చు. కానీ ఈ సర్వేతో తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రభుత్వం తన ప్రజలు ఎదిగేందుకు ఏం కావాలి అన్న నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఖచ్చితంగా అవసరం. ప్రజల ప్రగతి కొరకే తప్ప మరెందుకు కాదు. అందుకే సర్వేకు సహకరించండి. చెప్పుడు మాటలు వినడం మానండి.