-వాడివేడిగా సాగిన సమావేశం
-వివాదాలపై నిలదీసిన కేసీఆర్
-చర్చించుకుందామన్న చంద్రబాబు
-గవర్నర్ తేనేటి విందుకు హాజరైన ఇద్దరు సిఎంలు
-గవర్నర్ చొరవతో జరిగిన అంతర్గత సమావేశం
-సహకరించుకోవాలని నరసింహన్ హితోక్తి
తెలంగాణ, ఏపీ సీఎంలు కే చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ చొరవతో జరిగిన ఈ సమావేశం వాడివేడిగానే జరిగినట్టు సమాచారం. పరిపాలనాపరమైన అంశాలు, కీలక నిర్ణయాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న వివాదాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ప్రత్యేక చొరవతో ఈ సమావేశం జరిగింది. జటిలమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. విందు తర్వాత గవర్న ర్ తన అంతర్గత సమావేశమందిరంలోకి ఇద్దరినీ పిలిచి వారితో ముఖాముఖి సమావేశానికి తెరతీశారు.ఈ సమావేశం హాట్హాట్గానే సాగింది. హైదరాబాద్పై గవర్నర్కు ప్రత్యేక అధికారాల వ్యవహరంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సామాజిక సర్వేను వివాదాస్పదం చేయడం వంటి అంశాలపై వేడిగానే చర్చ జరిగినట్లు సమాచారం.
తెలంగాణ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడిన విషయాన్ని పరిగణించకుండా తమ రాష్ట్ర పరిపాలనా నిర్ణయాలలో జోక్యం చేసుకుని వివాదాలు సృష్టించడం తగదని చంద్రబాబుతో కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ధిక్కరించి తెలంగాణకు వినియోగానికి అనుగుణంగా రావాల్సిన విద్యుత్ సరఫరాను అడ్డుకుం టూ సమస్యలు సృష్టిస్తున్న మీరు మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని కేసిఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసి లేని పేచీలు పెడుతున్నారని, ఆ కారణంగానే ఉన్న కాస్త సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని అన్నట్లు తెలుస్తోంది.
చివరకు అభివృద్ధి ప్రణాళికలకోసం ఉద్ధేశించి తాము బృహత్తరమైన ఇంటింటి సామాజిక సర్వే నిర్వహించుకుంటూ ఉంటే దాన్ని కూడా వివాదాస్పదం చేస్తా రా? కేంద్రానికి ఫిర్యాదులు చేస్తా రా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. దానికి జవాబుగా ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు ఇతర అంశాలపై కూర్చోని మాట్లాడుదామని, సామరస్యపూర్వకంగానే సమస్య ను పరిష్కరించాలన్నది తన అభిమతం తప్ప మరొకటి కాదని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. గవర్నర్ జోక్యం చేసుకుని విభజన చట్టాన్ని అనుసరించి రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు పాలన సాగించాలని సూచించారని సమాచారం. సమావేశం మాత్రం కొన్ని విషయాలపై ఏకాభిప్రాయం లేకుండానే ముగిసినట్లు చెబుతున్నారు.
తేనీటి విందులో సరదాగా.. అంతకు ముందు రాజ్భవన్లో జరిగిన తేనీటి విందు సమావేశంలో సీఎంలు కే చంద్రశేఖర్రావు, చంద్రబాబు నాయుడు సరదా సంభాషణలతో హల్చల్ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈ విందు ఇచ్చారు.
కేసీఆర్, చంద్రబాబు వ్యక్తిగత కుశల ప్రశ్నలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విందుకు స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్. హోంమంత్రి నాయిని, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎంపీలు కవిత, సుమన్, చీఫ్ సెక్రెటరీ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో